
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇంటికి బాంబు బెదిరింపు రావడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. చెన్నైలోని అల్వార్పేట, వీనస్ కాలనీలో ఉన్న నయన్ కొత్త ఇంటికి ఓ ఫోన్ కాల్ ద్వారా బాంబు ఉందన్న అలర్ట్ అందింది. వెంటనే పోలీసుల బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ టీమ్ అక్కడికి చేరుకుని ఇంటి అంతటా తనిఖీలు చేపట్టాయి.
అయితే చివరికి అది నకిలీ కాల్ అని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో నయన్, ఆమె భర్త విగ్నేష్ శివన్ ఇద్దరూ ఇంట్లో లేరు. నయన్ ప్రస్తుతం హైదరాబాద్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. ఈ ఘటన తెలుసుకున్న నయన్ కంగారు పడినట్లు సమాచారం.
గత కొద్ది నెలలుగా తమిళనాడులో బాంబు బెదిరింపుల సిరీస్ కొనసాగుతోంది. పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, సెలబ్రిటీల ఇళ్లకు కూడా ఇలాగే కాల్స్ వస్తున్నాయి. కేవలం ఐదు రోజుల క్రితమే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, నటి త్రిష, స్వర్ణ మాల్యా ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
పోలీసులు ఈ ఫేక్ కాల్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
నయనతార ఈ మధ్యనే భారీ మొత్తంలో ఖర్చు చేసి అల్వార్పేటలోని వీనస్ కాలనీలో కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఫ్యాన్స్లో హల్చల్ రేపింది.
